నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 అనకాపల్లిజిల్లా, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా చింతకాయల పద్మావతి

 


మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థినులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలి" అని సూచించారు. సమాజంలో లింగ సమానత్వం కోసం అందరూ కృషి చేయాలి. మహిళలు పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలా వెండింగ్ మిషన్, బర్నింగ్ మిషన్ అందజేస్తానని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా, నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆడియో సిస్టమ్‌ను ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రేవతమ్మ మాట్లాడుతూ, "బయటి ప్రపంచంలో, ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. స్వీయరక్షణకు సంబంధించి అవగాహన పెంచుకోవాలి" అని విద్యార్థులకు సూచించారు.

నర్సీపట్నం గైనకాలజిస్ట్ డాక్టర్ పి. వందన మాట్లాడుతూ, "స్త్రీలు ఆత్మస్థైర్యంతో జీవించాలి. ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి" అని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రాజు, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.ఎస్. కృష్ణ కళాశాలలో విద్యార్థినులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.